కీలడి పరిశోధనలో మరో అడుగు | - | Sakshi
Sakshi News home page

కీలడి పరిశోధనలో మరో అడుగు

Jun 30 2025 4:04 AM | Updated on Jun 30 2025 4:04 AM

కీలడి పరిశోధనలో మరో అడుగు

కీలడి పరిశోధనలో మరో అడుగు

● సైన్స్‌ పరంగా నిరూపితం ● పుర్రెల ఆధారంగా ముఖ చిత్రం

సాక్షి, చైన్నె: మదురై సమీపంలోని కీలడిలో ఏళ్ల తరబడి జరుగుతున్న పురావస్తు పరిశోధనలో తమిళులు మరో ముందడుగు వేశారు. సైన్స్‌ పరంగా తమిళ చరిత్రను నిరూపితం చేసే విధంగా బ్రిటన్‌ సహకారంతో విజయవంతం చేశారు. 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది పుర్రె ఆధారంగా బహిర్గతం చేశారు. మదురై సమీపంలోని కీలడిలో తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా పురాతన సంపదలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలుత 2013 నుంచి 2016 వరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పరిశోధనలు చేసింది. పురావస్తు శాస్త్రవేత్త అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధన హఠాత్తుగా ఆగడం చర్చకు దారి తీసింది. దీంతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2016 నుంచి ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లభించిన వస్తువులను ఓపెన్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. అలాగే, ఇక్కడ బ్రహ్మాండ ఆడిటోరియం, ఎగ్జిబిషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సమయంలో అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ బృందం పరిశోధన నివేదికను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఓ వైపు తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. అలాగే, ఈ వ్యవహారం మదురై ధర్మాసనంలో సైతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కీలడి పరిశోదనలో మరో ముందుడుగు వేశారు.

పుర్రెలతో ముఖ చిత్రం

కీలడి పరిశోధనలో తమిళ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి. ఇందులో పుర్రెలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మనుషులు ఎలా జీవించారో అన్న అంశానికి దర్పణం పట్టే విధంగా వారు ఉపయోగించిన ఎన్నో పరికరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఇక్కడ లభించిన పుర్రెల ఆధారంగా చేసుకుని 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది తాజాగా సైన్స్‌ పరిశోధనలో తేటతెల్లమైంది. మదురై కామరాజర్‌ వర్సిటీ, బ్రిటన్‌లోని జోన్‌ మోస్‌ వర్సిటీ ఈ పుర్రెల ఆధారంగా జరిపిన పరిశోధన విజయవంతమైంది. ఈ వివరాలను ఆదివారం వెలుగులోకి రావడంతో సీఎం స్టాలిన్‌ స్పందించారు. ప్రాచీన తమిళ సాహిత్యం గురించి వివరిస్తూ కీలడిలో జరిగిన పరిశోధనలు తాజాగా సైన్స్‌ ఆధారంగా సైతం నిరూపితమైందన్నారు. మన పూర్వీకులు ఎలా ఉండే వారో తాజాగా స్పష్టమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ తమిళనాడు చరిత్ర, సంస్కృతి ఏమిటో అన్నది ఇకనైనా కేంద్రంలోని బీజేపీ పాలకులు గుర్తెరగాలని హితవు పలికారు. తమిళ చరిత్ర, సంస్కృతిని తుంగలో తొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకులకు తాజాగా సైన్స్‌ సైతం ఇదే వాస్తవం అని నిరూపించిందన్నారు. తమిళనాడు చరిత్రకు ఆధారాలను సైన్స్‌ సైతం స్పష్టం చేసిందని, ఇకనైనా కేంద్రం అమర్‌నాథ్‌ నివేదికను తేటతెల్లం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement