
పుష్ప సోయగం..భక్తజన పారవశ్యం
–బోయకొండ ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం సరికొత్త శోభతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. చూడగానే కట్టిపడేలా పుష్పాలంకరణతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఆదివారం బెంగళూరుకు చెందిన కృష్ణప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూ.3లక్షల విలువ చేసే పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీంతో ఆలయం అంతా పుష్ప పరిమళ భరిత పుష్పాల కొత్తదనం..అందాలు భక్తులను కట్టిపడేశాయి. ఆషాఢ మాసంలో కర్ణాటక భక్తులు అమ్మవారి దర్శనం కోసం విరివిగా రావడం పరిపాటి. బెంగళూరు నుంచి పూలను తీసుకొచ్చి శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జామున వరకు ఆలయం లోపల, ఆలయం ముందు భాగం, చుట్టూ పరిసరాల్లో పూలతో అలంకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా పూజలు చేయించారు. కోరిన కోర్కెలు ఫలించడంతో పుష్పాలంకరణ చేసి మొక్కుబడి చెల్లించినట్లు కృష్ణప్ప తెలిపారు. దాత కుటుంబ సభ్యులకు ఈఓ ఏకాంబరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.