
రాందాసు ప్రాణాలకు ముప్పు
సేలం: అన్బుమణి మద్దతుదారుల నుంచి రాందాసు ప్రాణాలకు ముప్పు ఉందని సేలం పశ్చిమ నియోజకవర్గం పీఎంకే ఎమ్మెల్యే అరుల్ ఆరోపించారు. రాందాసును కించపరచడం మానుకోవాలని అన్బుమణిని హెచ్చరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. పార్టీ వర్గాలు, ముఖ్యులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రాందాసు వెన్నంటే సీనియర్లు, ముఖ్యులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సమయంలో రాందాసును టార్గెట్ చేస్తూ అన్బుమణి విమర్శలు గుప్పిస్తుండడంతో మీడియా ముందుకు ఆదివారం ఎమ్మెల్యే అరుల్ వచ్చారు. అన్బుమణిని హెచ్చరించే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు. రాందాసువి పిల్ల చేష్టలుగా అన్బుమణి పేర్కొనడాన్ని ఖండించారు. అన్బుమణి రామదాస్ కారణంగా గత 15 సంవత్సరాలుగా వరసుగా పార్టీ పతనం వైపు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడైన రాందాసును అన్బుమణి అవమానకరంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీకి పూర్వవైభవం మళ్లీ రావాలంటే 2026 ఎన్నికల్లో రాందాసు నేతృత్వంలో పార్టీ ముందుకు సాగాల్సిన అవశ్యం ఉందన్నారు. కాగా ఇతరులు అవమానించినా, కించ పరిచినా, మనం మాత్రం ఎవర్ని బాధ కలిగించకుండా వ్యవహరించాలని ఆదివారం తైలాపురంలో జరిగిన సోషల్ మీడియా పార్టీ ప్రతినిధుల సమావేశంలో రాందాసు సూచించడం గమనార్హం.
ఎమ్మెల్యే అరుల్ ఆరోపణ
అన్బుమణికి హెచ్చరికలు