
ఒకే జట్టుగా తమిళనాడు!
తమిళనాడు అంతా ఒకే జట్టు అన్నట్టుగా ఏకం అవుదాం అని కేడర్, ప్రజలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. జూలై ఒకటి నుంచి సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుదాం అని ఆదేశించారు. 68 వేల మంది సోషల్మీడియా సైన్యంతో మరింతగా ప్రజలలోకి చొచ్చుకెళ్దామని వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె: మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ వ్యూహాలకు సీఎం ఎంకే స్టాలిన్ పదును పెట్టిన విషయం తెలిసిందే. డీఎంకే యువజన విభాగం ఓ వైపు, పార్టీ అనుబంధ విభాగాలు మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాయి. జిల్లాలు, యూనియన్లు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వారీగా ఎన్నికల పనులు మరింత వేగవంతం చేయించడమే కాకుండా, ప్రజలలోకి చొచ్చుకేళ్లే కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా దరి చేరాయా? అని పరిశీలించి అర్హులైన వారికి మరిన్ని పథకాలను దరి చేర్చే దిశగా కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలతో ఉడన్పెరుప్పే వా...( సోదరా ..కదిలిరా) నినాదంతో సీఎం స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ఏడు డివిజన్లుగా పార్టీ పరంగా విభజించారు. ఆయా డివిజన్లకు ఇన్చార్జ్లనురంగంలోకి దించారు. జిల్లాల కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసి పనుల వేగాన్ని పెంచారు. ఈ వ్యూహాలలో భాగంగా శనివారం అందియూరు, మొడకురిచ్చి, మేట్టుపాళయం జిల్లాల నేతలతో ఒన్ టూ ఒన్గా స్టాలిన్ సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనంచేశారు. ఈ సమావేశాలలో భాగంగా జూలై 1 నుంచి చేపట్టనున్న సభ్యత్వ నమోదు గురించి కేడర్కు సందేశాన్ని స్టాలిన్ పంపించారు.
న్యూస్రీల్
ఏకం అవుదాం
జూలై 1 నుంచి సభ్యత్వానికి శ్రీకారం చుడుదాం
68 వేల మందితో డీఎంకే డిజిటల్ సైన్యం
ద్రోహులకు చోటు లేదు..
సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టే విధంగా తమిళనాడు అంతా ఒకే జట్టు అని చాటే దిశగా ఏకం అవుదామన్న పిలుపుతో కేడర్, ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. 75 సంవత్సరాల డీఎంకే ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, ఏడవ సారిగా సైతం అధికారం లక్ష్యంగా శ్రమిద్దామని పిలుపు నిచ్చారు. కలైంజ్ఞర్ నిర్దేశించిన మార్గంలో సమగ్ర ప్రణాళికతో 2026లోనూ అధికారం కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ మరింతగా దూసుకెళ్లాల్సిన తరుణం మొదలైందన్నారు. ఇందుకోసం జూలై 1 నుంచి ఓరనియిల్ తమిళనాడు( ఒకే జట్టుగా తమిళనాడు)నినాదంతో గొప్ప సభ్యత్వ నమోదుతో పాటూ ప్రచార భేరి మోగిద్దామని పిలుపు నిచ్చారు. ఓరనియిల్ తమిళనాడు పేరిట ప్రత్యేక యాప్ను సిద్ధం చేసి, డిజిటల్ సైన్యాన్ని సైతం రంగంలోకి దించామని వివరించారు. 234 నియోజకవర్గాలలోని 68 వేల పోలింగ్ బూత్లలో ఈ సైన్యానికి శిక్షణ ఇచ్చామని, వీరితో కలిసి నాయకులు ఇంటింటా వెళ్లాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించాలని,ద్రావిడ మోడల్ ప్రభుత్వం పనితీరును విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ఒక్కో పోలింగ్ బూత్కు కనీసం 30 శాతం సభ్యులను చేర్చే దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ద్రోహులకు తమిళనాడులో చోటు లేదని, మతం, కులం ముసుగులో ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం చేసే శక్తులను తరిమి కొట్టేందుకు ప్రజా మద్దతును విస్తృతంగా సేకరించాలని ఆదేశించారు.

ఒకే జట్టుగా తమిళనాడు!

ఒకే జట్టుగా తమిళనాడు!

ఒకే జట్టుగా తమిళనాడు!