
తిరుచెందూరులో పనులు వేగవంతం
● పరిశీలించిన మంత్రులు, ఎంపీ
సాక్షి, చైన్నె: తిరుచెందూరులో కుంభాభిషేకం పనులు ముగింపుదశకు చేరాయి. ఈ పనులను శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, ఎంపీ కనిమొళి పరిశీలించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యంభక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ కుంభాభిషేక పనులకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జూలై ఏడున ఇక్కడ జరగనున్నది. దేశ విదేశాల నుంచి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు ఈ వేడుకకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమైన సమాచారాలు వచ్చాయి.
ఒకటి నుంచి పూజలు
కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలుమొదలు కానున్నాయి. తొలి రోజున యాగశాల పూజలతో ఉత్సవాలు మొదలు కాన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మైదానంలో యాగశాలను ఏర్పాటు చేసి పూజలకు చర్యలు తీసుకున్నారు.ఈ ఉత్సవం ధృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలను తూత్తుకుడి జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది.
పరిశీలన..
శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిలు ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాల, ఆలయ పరిసరాలు, సముద్ర తీరంలో చేసిన ఏర్పాట్లను వీక్షించారు. భక్తుల కోసం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వీటన్నింటి గురించి జిల్లా కలెక్టర్ ఇలం భగవత్ మంత్రులు, ఎంపీకి వివరించారు.తాము చేపట్టనున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ వివరించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లన్నీ ముగింపు దశకు చేరాయని వివరించారు. భక్తులు ముడుపులు సమర్పించే సమయంలో ఎలాంటి తొక్కిసలాటలకు చోటు కల్పించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు, సముద్ర తీరంలోకి చొచ్చుకు వెళ్లకుండా మరింత భద్రతపరంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.