
విద్యార్థుల కోసం వాటర్ బెల్
● జూలై 1 నుంచి బడుల్లో అమలు
సాక్షి, చైన్నె : విద్యార్థుల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా వాటర్ బెల్పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉదయం వేళలో పిల్లల ఆకలి తీర్చేలా అల్పాహార పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం మరిన్ని పథకాలు అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బడి వేళలో సరిగ్గా నీరు సేవించడం లేదని అధ్యయనంలో తేలింది. పిల్లలు వాటర్ బాటిళ్లు బడులకు తీసుకెళుతున్నా నీరు తాగడం లేదని వెలుగు చూసింది. దీంతో పిల్లల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు వాటర్ బెల్ పేరిట పథకం అమలుకు సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులను శనివారం విద్యాశాఖ డైరెక్టర్ కన్నప్పన్ జారీ చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల కార్యదర్శులు ఈ పథకాన్ని జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలల్లో సరిగ్గా నీళ్లు తాగేందుకు వీలుగా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయం కేటాయించనున్నారు. ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 3 గంటలకు మూడు సార్లు ప్రత్యేకంగా పాఠశాలలో బెల్ మోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బెల్ మోగినప్పుడల్లా విద్యార్థులు తాము తెచ్చుకున్న బాటిళ్లలో నుంచి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను డీ హైడ్రేషన్ నుంచి రక్షించడంలో భాగంగా ఈ ప్రయత్నం చేపట్టినట్టు ప్రభుత్వం వివరించింది.