
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన క్రమంలో శనివారం ఉదయం తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, కలెక్టర్ ప్రతాప్ అకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ సరుకు పంపిణీలో బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. అయితే ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఒక కార్డుదారుడికి సరుకులను ఇవ్వడానికి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, తద్వారా కాలయాపన జరగడంతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడితే సమస్యలు మరింత జఠిలం అవుతాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ సిబ్బంది శుక్రవారం ఉదయం ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వాధికారుల్లో చలనం మొదలైంది. పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ తదితరులు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. కొత్త విధానం అమలు, సరుకుల నాణ్యతతో పాటు ఇతర వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.