
బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్
● ఉత్తమ రచనలకు గుర్తింపు ● సాహితీ అవార్డు గ్రహీలకు ప్రభుత్వ గృహాలు ● సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత నేత కలైంజ్ఞర్ అని సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు. ఉత్తమ రచనలు, రచయితలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా, వారికి సరైన గుర్తింపు ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సాహితీ అవార్డు గ్రహీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు.కాంచీపురం ఏకాంబరనాథర్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చూలైమేడులోని అంజుగం ప్రాథమిక పాఠశాలలో రూ. 13.94 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాలను సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. ఆ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసామగ్రి, సైకిళ్లను అందజేశారు. కీల్పాకంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ పరిధిలోని విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం స్టాలిన్ తిలకించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రి పి.కే. శేఖర్బాబు, ధర్మపుర ఆధీనం మాసిలామణి దేశిక జ్ఞానసంపద పరమాచార్యస్వామి, కుండ్రకుడి ఆధీనం పొన్నంబల దేశిక ఆడిగలార్, మయిలం బొమ్మపుర ఆధీనం శివజ్ఞానపాలయ స్వామిగల్, శ్రీపెరంబుదూర్ మఠం అప్పన్ ఉలగరియ రామానుజ ఎంబార్ జీయర్ స్వామిగల్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్, ఎమ్మెల్యేలు ఎంకే. మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కలైవానర్ అరంగంలో శతాబ్ది ఉత్సవ సదస్సు
సాహితి అకాడమీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, తమిళ శాఖ సంయుక్తంగా కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం జరిగింది. ముత్తమిళరిగ్నర్ కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం పేరిట జరిగిన సదస్సుకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. సదస్సును ప్రారంభించడంతో పాటు ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అలాగే సాహితీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వ గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ వివిధ అంశాల ఆధారంగా జరిగిన ఈ సదస్సుకు పెట్టిన పేరులో కలైంజ్ఞర్కు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు నాయకుడిగా, కళాకారుడిగా, అపార ప్రతిభావంతుడి బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్ కరుణానిఽధి అని కొనియాడారు. రంగ స్థల ప్రసంగాలు, సాహిత్యానికి మరో ముఖంగా కలైంజ్ఞర్ ఉన్నారని, శాసన సభలో ఆయన ప్రసంగం సభా గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన జీవితంలో 80 సంవత్సరాలు ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడని, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు భారతీయ సమాజాన్ని ప్రేరేపించాయని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆదర్శంగా సాహిత్య అకాడమీ గొప్పగా పనిచేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో ఈ వేదిక ఆధారంగా రచయితలు, అనువాదకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాహిత్య అకాడమీ లక్ష్యంగా పయనం సాగుతున్నట్టు తెలిపారు. తమిళ సాహిత్యం ప్రత్యేక రంగంగా తీర్చిదిద్దేలా రూ. 5.30 కోట్లు కేటాయించామని గుర్తు చేస్తూ, ఈ సమయంలో తాను ఒక సందేశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నానన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ముగ్గురు తమిళ పండితులకు కలైంజ్ఞర్ కలల ప్రాజెక్టు గా హోమ్ అనే పథకం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాజెక్టులో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు 15 మంది పండితులకు స్కాలర్షిప్లను అందించిందని, ఇక, డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ ఖర్చులు తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందన్నారు. సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీతలకు సైతం ఇక గృహాలను అందజేయనున్నామని ప్రకటించారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమల్లో లేదని, ఇదికొనసాగుతుందని స్పష్టం చేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్

బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్