
7నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
● ర్యాంకుల జాబితా విడుదల ● జనరల్ కౌన్సెలింగ్ 14 నుంచి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కోటా సీట్ల భర్తీ నిమిత్తం కౌన్సెలింగ్ తేదీ ఖరారు చేశారు. జూలై 7 నుంచి రిజర్వుడ్, 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కటాఫ్ మార్కులు 200లకుగాను 200 సాధించిన టాపర్లు, కౌన్సెలింగ్కు అర్హత సాధించిన ఇతర ర్యాంకర్ల జాబితాను ఉన్నత విద్యా మంత్రి కోవిచెలియన్ శుక్రవారం ప్రకటించారు.
రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ఆధారంగా ర్యాండం నంబర్లను ప్రకటించారు. ప్లస్టూ మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి ర్యాంకుల జాబితాను సిద్ధం చేశారు. ఉదయం అన్నావర్సిటీ ఆవరణలోని సాంకేతిక విద్యా డైరెక్టరేట్లో ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ జాబితాను విడుదల చేశారు. సీట్ల కోసం 3 లక్షల 2374 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్టు మంత్రి ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సారి 40,645 మంది అదనంగా నమోదు చేసుకున్నారని తెలిపారు.
జూలై 7 నుంచి కౌన్సిలింగ్..
200లకుగాను 200 కటాఫ్ మార్కులను స్టేట్ బోర్డు సిలబస్లో చదువుకున్న 144 మంది, ఇతర బోర్డుల ద్వారా చదువుకున్న ఐదుగురు ఉన్నారని ప్రకటించారు. వెబ్సైట్లో ర్యాంకుల జాబితా ఉన్నట్టు, ఏదేని లోపాలు ఉన్నా, ఎవరి పేర్లు అయినా లేకున్నా వెంటనే సమీపంలోని అడ్మిషన్ సెంటర్లను సంప్రదించి జూలై 2లోపు ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు అర్హత సాధించిన వారిలో 2 లక్షల 41 వేల 641 మంది ఉన్నారని, వీరిలో రిజర్వుడ్ కోటా సీట్లకు (క్రీడ, దివ్యాంగులు, మాజీ సైనికులు) జూలై 7 నుంచి 11వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. జనరల్ కోటా జూలై 14 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నామన్నారు. అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగుతుందన్నారు.
టాపర్లు..
స్టేట్ బోర్డు సిలబస్ ఆధారంగా మంత్రి ప్రకటించిన జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో తొలి స్థానాన్ని కాంచీపురానికి చెందిన సహస్త్ర అనే విద్యార్థిని దక్కించుకుంది. రెండవ స్థానంలో నామ్కల్కు చెందిన కార్తిక, మూడో స్థానం అరియలూరుకు చెందిన అమలన్ ఆంటో దక్కించుకున్నారు. ఇక 7.5 శాతం ప్రభుత్వ ప్రత్యేక కోటా మేరకు తొలి స్థానాన్ని కడలూరుకు చెందిన ధరణి, రెండో స్థానాన్ని చైన్నెకు చెందిన మైథిలి, మూడో స్థానాన్ని కడలూరుకు చెందిన మురళిధరన్ ఉన్నారు. జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో టాప్ 10లో ఏడుగురు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్కు ప్రభుత్వ పాఠశాలల నుంచి 47,372 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, విద్యార్థులు ఏదేని సందేహాలను నివృతి చేసుకోదలచిన పక్షంలో 18004250110 టోల్ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
70 వేలు దాటిన వైద్య దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలలు, ప్రైవేటు కళాశాలలోని ప్రభుత్వ కోటా పరిధిలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీకి నీట్ మార్కుల ఆధారంగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదివేల లోపు సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆదివారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత నీట్ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను ప్రకటించే విధంగా వైద్య విద్యా డైరెక్టరేట్ అడ్మిషన్స్ విభాగం కార్యదర్శి థేరనిరాజన్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. కొన్ని కోర్సులు మిగిలి ఉండడంతో వాటిని భర్తీ చేయడానికి రెండో విడత కౌన్సెలింగ్కు చర్యలు చేపట్టారు.