
రామన్నతో సెల్వం భేటీ!
● తైలాపురానికి టీఎన్సీసీ నేతలు ● రాజకీయాలు లేవని స్పష్టం
సాక్షి, చైన్నె: పీఎంకే అధ్యక్షుడు రాందాసుతో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ముఖ్యనేతలతో కలిసి తైలాపురానికి సెల్వ పెరుంతొగై వెళ్లడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్యసాగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. తమ మధ్య వివాదాలు, విభేదాలకు డీఎంకే కారణం అంటూ అన్బుమణి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో కీలకపార్టీగా ఉన్న తమిళనాడు కాంగ్రెస్ ప్రతినిధులు శుక్రవారం ఉదయాన్నే తైలాపురం గెస్ట్హౌస్కు వెళ్లి రాందాసును కలవడం రాజకీయ ఆంతర్యానికి పరిస్థితులు కల్పించినట్లైంది.
రామన్నతో భేటీ
గత కొద్దిరోజులుగా రాందాసు డీఎంకే కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు రూబి మనోహర్, విజయన్లతో కలిసి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తైలాపురానికి వెళ్లారు. రాందాసుతో కాసేపు మాట్లాడారు. అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలు లేవు, కూటమి ప్రయత్నాలు లేవని తేల్చి చెప్పారు. పీఎంకే వివాదంలో సామరస్యం కుదర్చాల్సిన అవసరం తమకు ఎందుకు అని, అది వారికి సంబంధించినది వారే పరిష్కరించుకుంటారని సమాధానం ఇచ్చారు. వారి వివాదంలోకి అన్బుమణి డీఎంకే లాగే విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. బీజేపీ నిర్బంధానికి గురై ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అంటూనే, ఆయన మనస్సు అంతా డీఎంకేతోనే ఉంటుందని చమత్కరించారు. డీఎంకేలోకి పీఎంకే వస్తుందా అని ప్రశ్నించగా, డీఎంకే కూటమి బలంగా ఉందని, పీఎంకేను చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం స్టాలిన్పై ఉందన్నారు. తమిళనాడు అన్ని రంగాల్లో బలంగా ఉందని, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా దూసుకెళ్తోందని, తమ కూటమి ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము మాత్రం ఇక్కడ రాజకీయంగా రాలేదని, పుదుచ్చేరికి వెళ్లి వస్తూ మార్గ మధ్యలో దిండివనం తైలాపురానికి వచ్చి రాందాసును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్టు అన్నారు.