
మొహర్రం సమ్మేళనానికి శ్రీకారం
సాక్షి, చైన్నె : మొహర్రం నెల ప్రారంభంతో మొహర్రం ఆథ్యాత్మిక సమ్మేళనానికి చైన్నె వేదికగా శుక్రవారం శ్రీకారం చుట్టారు. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి 53వ నాయకుడైన సయ్యద్నా ముఫద్దాల్ సైపుద్దీన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆషారా ముబారకా పేరిట జూలై 5వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. సయ్యద్నా సైఫుద్దీన్ వార్షిక మొహర్రం సమ్మేళనంలో ప్రవక్త మహ్మద్ మనవుడైన ఇమామ్ హుస్సేన్ త్యాగాలను, కర్బలాలో ఆయన బలిదానం వంటి అంశాల గురించి ప్రసంగిస్తున్నారు. చైన్నెలోని ఎస్ఎంబీ వీధిలోని సైఫీ మసీదు, వింగ్స్ కన్వెన్షన్ సెంటర్, వైఎంసీఏ, బిన్నీ గ్రౌండ్తో సహా నగరంలో తొమ్మిదిచోట్ల ఆయన ప్రసంగాలను ప్రత్యేకప్రసారం ద్వారా తొలి రోజున దావూదీ బోహ్రా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సుమారు 43 వేల మంది వీక్షించినట్టు నిర్వాహకులు ప్రకటించారు. చైన్నెలో జరిగే ప్రసంగాలను కోయబత్తూరు, ఈరోడ్, సేలంలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లోని ఆ సామాజిక వర్గం వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చైన్నెలోని ఆ కమ్యూనిటీ ఔట్రీచ్ కో ఆర్డినేటర్ అలియాస్తర్ షకీర్ తెలిపారు. దక్షిణ భారత దేశ సాంస్కృతిక రాజధానిగా పిలవబడే చైన్నెలో సమ్మిళితత్వం, వైవిధ్యం, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి సైఫుద్దీన్ పర్యటన మరింత దోహదకరంగా మారినట్టు వ్యాఖ్యానించారు.

మొహర్రం సమ్మేళనానికి శ్రీకారం