
పళణి పర్యటన షెడ్యూల్ విడుదల
● 7 నుంచి రాష్ట్ర పర్యటన
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామి రాష్ట్ర పర్యటన రూట్ మ్యాప్ వెలువడింది. జూలై 7వ తేదీ నుంచి విస్తృతంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించనున్నారు. 2026లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పళణిస్వామి పదును పెట్టిన విషయం తెలిసిందే. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. జూలై 7న కోయంబత్తూరులోని మేట్టుపాళయం సమీపంలోని గౌండంపాళయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన పర్యటనకు శ్రీకారంచుట్టనున్నారు. ముందుగా కోయంబత్తూరు, ఆ తర్వాత విల్లుపురం, కళ్లకురిచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల మీదుగా సాగే విధంగా రూట్ మ్యాప్ను రూపకల్పన చేసుకుని ఉండడం శుక్రవారం అన్నాడీఎంకే కార్యాలయం ప్రకటించింది. తొలి విడత పర్యటన జూలై 20వ తేదీ వరకు జరగనుంది. కాగా, అన్నాడీఎంకే చిహ్నం ఇతర వ్యవహారాలపై ఎన్నికల కమిషన్ కోర్టులో ఉన్న బంతి విషయంగా ఎలాంటి నిర్ణయం ఇంతవరకు వెలువడలేదు. దీంతో పళణిస్వామి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సమయంలో అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తుది ఉత్తర్వులు ఎప్పుడు వెలువడతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది.