
ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు ప్రచారానికి శ్రీకారం
కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ–డాడీ సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు(విద్యుదీకరణ తమిళనాడు) ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు యాస్మీన్ జవహర్ అలీ తెలిపారు. చైన్నెలోని ట్రేడ్ సెంటర్లో శుక్రవారం నుంచి ఈవీ ఇండియా ఎక్స్పో 2025 ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ మెబిలిటీలో పేరుగాంచిన ఈ–డాడీ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ఐఆర్ఏఐ ఆమోదించిన మల్టీ వెహికల్ ఈవీ రెట్రోఫిట్ కిట్ను ఆవిష్కరించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుదీకరణ తమిళనాడు పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిని స్టార్టప్ టీఎన్ సీఈఓ, మిషన్ డైరెక్టర్ శివరాజారామయ్య, ఇప్పో పే వ్యవస్థాపకులు మోహన్ కె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మీన్ జవహర్ అలీ మట్లాడుతూ ఇంధన వాహనాలతో కాలుష్యం పెరిగిపోవడంతోపాటు ఖర్చులు ఎక్కువైపోతున్నాయన్నారు. ఇంధనంతో నడిపే వాహనాలను ఈవీ వెహికల్గా మార్చడమే లక్ష్యంపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. 2026 నాటికి తమిళనాడులోని టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల వాహనాలను రెట్రోఫిట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ–డాడీ ప్రారంభించిన రెట్రోఫిట్ కిట్ ఇప్పటికే ఉన్న ఇంధనంతో నడిచే ఆటో రిక్షాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి అనుమతి ఇచ్చిందని, ఈ కిట్ అమర్చడంతో సాధారణంగా ఇంధన ఖర్చుల కంటే దాదాపు 75 శాతం తక్కువ అవుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ఈ–డాడీ ఇంజినీరింగ్ చేసిన 2026లో ఉత్పత్తిని విడుదల చేయడానికి షెడ్యుల్ చేసిన పూర్తి ఎలక్ట్రిక్ త్రీ –వీలర్ అయిన ఎక్స్3 ఆటోను ప్రదర్శనలో ఉంచిందన్నారు. తేలికై న డిజైన్, ఎర్గోనామిక్ సౌకర్యం, స్మార్ట్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు.