
నిఘా నీడలో తీరం
● హై అలర్ట్
● తనిఖీలు ముమ్మరం
● సాగర్ కవచ్కు శ్రీకారం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి హైఅలర్ట్ ప్రకటించారు. నిఘా నీడలోకి తీర ప్రాంతాల్ని తీసుకొచ్చారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సిబ్బంది అలెర్ట్గా ఉన్నారో లేదో అని పసిగట్టే విధంగా 48 గంటల సాగర్ కవచ్ మాక్డ్రిల్కు శ్రీకారం చుట్టారు. వివరాలు.. గతంలో జరిగిన ముంబై పేలుళ్ల తదుపరి సముద్ర తీరాల్లో భద్రతను పర్యవేక్షించే రీతిలో ఆరు నెలలకు ఒక పర్యాయం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సాగర్ కవచ్ నినాదంతో ఈ డ్రిల్ పోలీసులకు ముచ్చమటలు పటిస్తున్నదని చెప్పవచ్చు. రాష్ట్రంలోని చైన్నె మొదలు కన్యాకుమారి వరకు ఉన్న 13 సముద్ర తీర జిల్లాల్లో 48 గంటల పాటూ ఈడ్రిల్ సాగుతుంది. బుధవారం ఉదయాన్నే ఆరున్నర గంటలకు ఈ డ్రిల్కు శ్రీకారంచుట్టారు. పోలీసులు, కోస్ట్గార్డ్, నావికాదళం, సముద్ర తీర భద్రత విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో తొలి రోజు ఈ డ్రిల్ సాగింది.
ఉరకలు... పరుగులు..
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై పోలీసులు సముద్ర తీరాల్లో వేకువ జామున ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఆయా సముద్ర తీర గ్రామాల్లో సైతం పోలీసులు రంగంలోకి దిగడంతో హడావుడి పెరిగింది. సముద్ర మార్గం గుండా మారు వేషాల్లో సిబ్బంది కొందరు ఆయా ప్రాంతాల్లోకి చొరబడనున్నారన్న సమాచారంతో, వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ప్రధానంగా వాహనాల తనిఖీలు జోరుగా సాగగా, మరోవైపు సముద్రతీరాల్లో జాలర్ల గ్రామాల్లోమఫ్టీలో ఉన్న సిబ్బంది ఆ మారు వేషగాళ్లను పట్టుకునేందుకు నిరీక్షించక తప్పలేదు. చైన్నె తీరం, ఈసీఆర్ మార్గంలో పోలీసులు అడుగడుగున చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీలో నిమగ్నం అయ్యారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసి అనుమతించారు. అప్రమత్తంగానే ఉన్నమని చాటే విధంగా సిబ్బంది ముందుకు సాగారు. చైన్నెలోని మెరీనా బీచ్, బీసెంట్ నగర్ బీచ్, హార్బర్ పరిసరాలలో అయితే, భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలతో సాగర్ కవచ్ గురువారం సాయంత్రం వరకు జరగనుంది.

నిఘా నీడలో తీరం