
సమాజ సేవకులకు సత్కారం
కొరుక్కుపేట: సమాజానికి విశేష సేవలను అందించిన పలువురు సేవకులను ఘనంగా సత్కరించారు. ఇందులో ట్రిప్లికేన్ రామ్నగర్కు చెందిన రిటైర్డ్ టీఎన్ఈబీ ఉద్యోగి పాల్ కొండయ్యను పుదియ జననాయగ మక్కల్ ఇయక్కం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. పుదియ జననాయగ మక్కల్ ఇయక్కం ఆధ్వర్యంలో చైన్నెలోని ఇస్కాన్లో డాక్టర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాణానికి, ఆయన ఆలోచనలు, సేవలు గురించి ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు టి.వేలవేనదన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ సభా నాయకులు సీకే తమిళరసన్, ఆర్ మత్తయ్యన్, మౌర్యయార్ బుద్ధ డోరా (దక్షిణ భారత బౌద్ధ కూటమి, అధ్యక్షుడు) పాల్గొన్నారు. ముఖ్య అతిథి తిరుమతి ఆమ్ స్ట్రాంగ్ విచ్చేసి సంఘ సేవకులకు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో పేద విద్యార్థులకు విద్య కోసం కృషి చేసిన పి.పాల్ కొండయ్యను అంబేడ్కర్ అవార్డుతో సత్కరించారు.