
హిందూ మున్నని నేత హత్య
● తిరుపూర్లో ఉద్రిక్తత
సేలం : తిరుపూర్లో నగదు వివాదం విషయమై హిందూ మున్నాని నాయకుడు హత్యకు గురయ్యారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపూర్ కుమరానందపురం ప్రాంతానికి చెందిన బాల మురుగన్(30) హిందూ మున్నని యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఇతడికి వివాహమైంది. బుధవారం తెల్లవారుజామున బాలమురుగనన్ను అతని ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాల మురుగన్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తిరుపూర్ నార్త్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తిరుపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటన నగదు లావాదేవిలకు సంబంధించి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి సుమన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో హత్యలో నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృత దేహాన్ని తీసుకోబోమని తిరుప్పూర్ ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతోపాటు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు వారితో చర్చలు జరిపి, ఈ ఘటనలో నిందితులందర్నీ అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.