
మురుగన్ మహానాడుపై ఫిర్యాదు
సాక్షి, చైన్నె : మదురైలో బీజేపీ, హిందూ మున్నని తదితర సంఘాల నేతృత్వంలో ఆదివారం జరిగిన తమిళ్ కడవుల్ మురుగన్ మహానాడుపై పోలీసులకు ఫిర్యాదు చేరింది. కొన్ని సంఘాలు మంగళవారం మదురై కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఆ మహానాడుకు హాజరైన బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, అన్నామలై, తమిళిసై, ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూ మున్నని నేతలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. రాజకీయాలకతీతంగా మహానాడు అని కోర్టుకు హామీ ఇచ్చి, రాజకీయ వ్యాఖ్యలు, తీర్మానాలు ఈ మహానాడులో చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ సంఘాల ప్రతినిధులు కోరారు. కాగా ఈ మహానాడులో పెరియార్, అన్నాలను అవమానించేలా లఘు చిత్రం ప్రదర్శించడాన్ని అన్నాడీఎంకే ఖండించింది. అన్నాకు వ్యతిరేకంగా వీడియో విడుదల చేసిన వారిని ఖండిస్తున్నామని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత ఆర్బీ ఉదయకుమార్ పేర్కొన్నారు. అలాగే, అన్నాను విమర్శించే వారిని వ్యతిరేకిస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించుకోవడం మానుకోవాలని లేకుంటే ప్రతిఘటన తప్పదని ఎండీఎంకే నేత వైగో హెచ్చరించారు. అన్నా, పెరియార్పై విమర్శలు గుప్పించిన మురుగన్ మహానాడులో పాల్గొనడం ద్వారా మరింతగా రాష్ట్రంలో అన్నాడీఎంకే పతనం మొదలైనట్టు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ వ్యాఖ్యానించారు.