
తిరుత్తణికి పోటెత్తిన భక్తులు
● స్వామి దర్శనానికి 4 గంటల సమయం ● వాహనసేవలకు అంతరాయం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. నాలుగు గంటలపాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రంలో స్కంధషష్టి సందర్భంగా స్వామికి సూరసంహార వేడుకలకు భిన్నంగా పుష్పాభిషేకం చేపడతారు. ఆలయ మూలవర్లకు వేకువజామున అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచం తొడిగి దీపారాధన పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కొండ ఆలయం వాహనాలతో నిండిపోవడంతో ఘాట్రోడ్డులో వాహనాలను కొండ కిందే వాహనాలు నిలుపుదల చేసి కాలినడకన వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో కొండ ఆలయం కిక్కిరిసింది. ఉచిత దర్శన క్యూలో నాలుగు గంటలు, రూ.100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.