
సూర్య 45వ చిత్రం కరుప్పు!
తమిళసినిమా: రెట్రో చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన సూర్య ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఒకటి. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి స్వాశిక, అనకా, మాయారవి, షివదా, సుప్రీత్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తరువాత సూర్య, త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని, జీకే.విష్ణు చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా డిఓషనల్తో కూడిన సాంఘిక కథా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక పండగలా ఉంటుందని నిర్మాతల వర్గం పేర్కొంది. కాగా ఈ చిత్రానికి కరుప్పు అనే పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. పోస్టర్లో సూర్య చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంగా నిలబడ్డారు. ఈ పోస్టర్కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. చిత్ర విడుదల తేదీన త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది.