
నైట్వాక్తో ‘లూపస్’పై అవగాహన
సాక్షి, చైన్నె: ఆళ్వార్ పేటలోని కావేరి హాస్పిటల్ నేతృత్వంలో చైన్నెలోని బెసెంట్ నగర్ ఎలియట్స్ బీచ్ రోడ్లో లూపస్ అవగాహన కోసం నైట్ వాక్ను విజయవంతంగా నిర్వహించారు. రుమటాలజీ విభాగం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. లక్షలాది మందిని ప్రభా వితం చేసే దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన లూపస్ గురించి ఈ కార్యక్రమంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ నడకతో రోగులు, సంరక్షకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాధారణ ప్రజలను ఒకచోట చేర్చినట్లయ్యింది. లూపస్తో జీవిస్తున్న వారి ప్రయాణాన్ని ప్రకాశవంతం చేయడమే లక్ష్యంగా సోమవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ షామ్ ఎస్ లూపస్ గురించి అవగాహన కల్పించే విధంగా ప్రసంగించారు. లూపస్ అనేది తరచుగా గుర్తించబడని సంక్లిష్టమైన పరిస్థితి అని, ఇది రోగ నిర్ధారణ , చికిత్సలో జాప్యానికి దారితీస్తుందని చెప్పారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన, పూర్తి జీవితాలను గడపడానికి సహాయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావేరి హాస్పిటల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్తో తదితరులు పాల్గొన్నారు.