
నిజమైన వసూళ్లను ప్రకటించండి
శశికుమార్తో టూరిస్ట్
ఫ్యామిలీ చిత్ర యూనిట్
తమిళసినిమా: ఇంతకుముందు గుడ్నైట్, లవర్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్స్ సంస్థ అధినేతలు పస్సియాన్ నజరేద్, మహేశ్ రాజ్ పస్సియాన్, యువరాజ్ గణేశన్ కలిసి తాజాగా నిర్మించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. సిమ్రాన్, శశికుమార్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని, అందించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఈనెల 1న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో నటుడు శశికుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం సక్సెస్ కావడంతో మీ పారితోషికం పెంచుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారన్నారు. తాను పారితోషికాన్ని పెంచనని స్పష్టం చేశారు. అలా పెంచితే చిత్రాల బడ్జెట్ ఇంకా పెరిగిపోతుందని అన్నారు. ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు గురించి అందరికీ తెలుసన్నారు. దీంతో తన చిత్రం వసూళ్లు ఇంతేనా అని ఆశ్చర్యపోయానన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం రూ.54 కోట్ల వరకూ వసూళ్లు సాధించిందన్నారు. తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది సుందరపాండియన్, కుట్టిపులి అని, వాటిని ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం అధిగమించిందని చెప్పారు. అదేవిధంగా మంచి కథలు తయారు చేసుకున్న కొత్తవారికి నమ్మకాన్ని కలిగించిన చిత్రం అని అన్నారు. చిత్రాల యథార్థ వసూళ్లను నటీనటులకు నిర్మాతలు చెప్పాలన్నారు. అప్పుడే వారు పారితోషికం పెంచరని అన్నారు. ఈ చిత్ర విజయం కొత్త ఊపిరి పోసిందని అన్నారు. ఇందులో సిమ్రాన్ నటించడానికి అంగీకరించడం సంతోషకరమన్నారు.

నిజమైన వసూళ్లను ప్రకటించండి