
సైన్యానికి సంఘీభావం!
● చైన్నెలో సీఎం నేతృత్వంలో ర్యాలీ ● నిఘా నీడలో రాజధాని నగరం ● సముద్ర తీరాలలో డేగ కళ్ల నిఘా ● విస్తృతంగా మాక్డ్రిల్ ● చైన్నెకు తమిళ విద్యార్థులు
నిఘా కట్టుదిట్టం..
పాకిస్థాన్ రాత్రి సమయాలలో డ్రోన్ దాడులకు పాల్పడుతుండడంతో పశ్చిమ రాష్ట్రాలలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈపరిస్థితుల్లో తమిళనాడు సముద్ర తీరం వె య్యి కమిటీ దూరం మేరకు ఉండడంతో తీరం వెంబడి భద్రతను పటిష్టం చేశారు. సముద్ర తీర మార్గాలలో వాహన తనిఖీలు రాత్రులలో ముమ్మరం చేశారు. చైన్నెలో అయితే మెరీనా నుంచి నీలాంకరై వరకు సముద్ర తీర మార్గంలో భద్రతా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. చైన్నెలోని ముఖ్య ప్రదేశాలు, గతంలో తీవ్రవాదులు హిట్ లిస్టులో ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతాలలో తుపాకీ భద్రతను కల్పించారు. రాత్రులలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక కన్యాకుమారిలోనూ భద్రత మరింతగా పెంచారు. చైన్నె,మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, సేలం, తూత్తుకుడి విమానాశ్రయాలలో భద్రతను ఐదు అంచెలకు పెంచారు.
సాక్షి, చైన్నె: భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న సమరంతో సరిహద్దు రాష్ట్రాలలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ రాత్రి వేళలో డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడులను తిప్పికొట్టే విధంగా భారత ఆర్మీ వీరోచితంగా శ్రమిస్తున్నారు. వందలాది డ్రోన్లను గాల్లోనే పేల్చి వేశారు. అలాగే పాకిస్థాన్లోకి చొరబడి అక్కడి ప్రజలకు ఇబ్బంది కలుగని రీతిలో పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీకి సంబంధించిన ఆస్తులపై దాడులను విజయవంతంగా చేస్తూ వస్తున్నారు. సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా భారత ఆర్మీ చేస్తున్న వీరోచిత శ్రమకు సంఘీభావం తెలుపుతూ సీఎం స్టాలిన్ ర్యాలీకి నిర్ణయించారు.
జన సందోహంతో ర్యాలీ..
డీజీపీ కార్యాలయం నుంచి సాయంత్రం ఐదు గంలకు సంఘీభావ ర్యాలీ ప్రారంభమైంది. భారత సైన్యానికి మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాదిగా జన సందోహం, మాజీ సైనికులు, విద్యార్థులు, స్వచ్చం సంస్థలు, అధికారులు, పోలీసులు, ఆర్మీ వర్గాలు భాగస్వామ్యమయ్యారు. ఈ ర్యాలీ దృష్ట్యా, 10 ప్రదేశాలలో వైద్య శిబిరాలు, 200 ప్రదేశాలలో అరేబియన్ గుడారాలు,, 71 ప్రదేశాలలో తాగునీటి ట్యాంకులు, 50 ప్రదేశాలలో టాయిలెట్ సౌకర్యాలు కల్పించారు. 15 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. పాకిస్థాన్ ఉల్లంఘన చర్యలు, ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి ఐక్యతతో మద్దతును ప్రకటిస్తూ , జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీలలో జనం సందోహం కదిలారు. సీఎం స్టాలిన్ తన చేతులలో జాతీయ జెండాను చేత ముందుగా సాగారు. ఆయన వెన్నంటి మంత్రులు, అధికారులు, జన సందోహం కదిలారు. మెరీనా తీరం వెంబడి ఈర్యాలీ జరిగింది. ఐల్యాండ్ గ్రౌండ్ వద్ద ఉన్న వార్ మెమోరియల్ వరకు ర్యాలీ గంట పాటూ జరిగింది. వార్ మెమోరియల్ వద్ద దాడులలో అమరుడైన దినేష్ నాయక్తో పాటూ అమాయక ప్రజలకు అంజలి ఘటించే విధంగా నివాళి కార్యక్రమం జరిగింది. ఉగ్రవాదానికి అంతం.. భారత సైన్యానికే విజయం, భారత ఆర్మీ వెన్నంటి తాము ఉన్నామన్న నినాదాలు ఈ ర్యాలీలలో హోరెత్తించాయి. ఐక్యతతో భారత దేశం ఉందని, పాకిస్థాన్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా కేంద్రానికి తమిళనాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు, డీజీపీ శంకర్ జివ్వాల్తో పాటుగా ముఖ్యలు పెద్ద ఎత్తున ర్యాలీలో అడుగులు వేశారు.
ర్యాలీకి సంబంధించిన జ్ఞాపికను
అందచేస్తున్న ఆర్మీ వర్గాలు
వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం ఎం కె స్టాలిన్
సురక్షితంగా రాక
పంజాబ్లో చిక్కుకున్న ఐదుగురు తమిళ విద్యార్థులు సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. బాంబుల మోతతో తీవ్ర మనో వేదనతో ఉన్న ఈ విద్యార్థలు తమ గోడును ప్రభుత్వానికి వివరించారు. దీంతో వీరిని ప్రత్యేక విమానంలో చైన్నెకు తీసుకొచ్చారు. ఇక్కడకు చేరుకున్న విద్యార్థులు ప్రత్యక్షంగా తాము దాడులను చూశామని, తీవ్ర ఆందోళనకు గురి అయ్యామని పేర్కొన్నారు. తమను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ దాడుల గురించి బీజేపీ నేత అన్నామలై స్పందిస్తూ, భారత్ తలచుకుంటే మ్యాప్లో ఆ దేశం కనుమరుగుకావడం తథ్యమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇండియాకు వ్యతిరేకంగా , పాకిస్థాన్కు అనుకూలంగా గాని ప్రచాకం చేసినా, ఇతర తప్పుడు సమాచారాలు, ఆధార రహిత వార్తలు, సమాచారాలు వ్యాపింపజేసినా చర్యలు తప్పవని పుదుచ్చేరిలో హెచ్చరికలు జారీ అయ్యాయి.

సైన్యానికి సంఘీభావం!