
నకిలీ బంగారు బిస్కెట్ విక్రయానికి యత్నం
తిరువళ్లూరు: నకిలీ బంగారు బిస్కెట్లను విక్రయించడానికి యత్నించిన గుంటూరుకు చెందిన అక్కతమ్ముళ్లను తిరువళ్లూరు తాలుకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఈకాడు ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్(35) స్నేహితురాలు శరణ్య ఎగువనల్లాట్టూరు గ్రామంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గత మార్చి 20న ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోకులపాడు గ్రామానికి చెందిన డేరంగుల లక్ష్మీ(29), ఈమె సోదరుడు ఉప్పాటాల రవికుమార్ తదితరులు బ్యూటీపార్లర్కు వచ్చారు. ఫేషియల్ చేసుకుని ఇంటికి వెళ్లినట్టు సమాచారం. అనంతరం తరచూ దుకాణానికి రావడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. దీనినే అదునుగా భావించిన లక్ష్మీ, రవికుమార్లు ఇద్దరూ శరణ్య వద్దకు వచ్చి తాము రోడ్డు విస్తరణ పనుల్లో కూలీలుగా ఉన్నామని తెలిపారు. తాము పనుల్లో ఉంన్న సమయంలో 430 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికినట్టు తెలిపారు. తమకు పది లక్షలు ఇస్తే బిస్కెట్ను ఇచ్చేస్తాని వివరించారు. దీంతో శరణ్య తన స్నేహితుడైన ఇర్ఫాన్కు సమాచారం అందించింది. దుకాణం వద్దకు వచ్చిన ఇర్ఫాన్ లక్ష్మీ, రవికుమార్ల వద్ద వున్న బంగారు బిస్కెట్ను సమీపంలోని నగల దుకాణానికి తీసుకెళ్లి పరిశీలించగా, సంబంధిత కడ్డీ ఒరిజినల్గా తేలింది. నెలరోజుల్లో డబ్బులు సిద్ధం చేసి పిలుస్తామని, అంత వరకు ఎవ్వరికీ విక్రయించవద్దని ఇర్ఫాన్ సూచించారు. రెండు రోజుల క్రితం పది లక్షలు రెడీ చేసిన ఇర్ఫాన్ బంగారు బిస్కెట్తో రావాలని కబురు పంపారు. ఇద్దరూ బంగారు బిస్కెట్ శనివారం బ్యూటీపార్లర్ వద్దకు వచ్చి గోల్డ్ బిస్కెట్ను అప్పగించారు. దీంతో మళ్లీ ఒకసారి సంబందిత నగలను చెక్చేయగా నకిలీగా తేలడంతో షాక్కు గురయ్యారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
అక్కాతమ్ముడి అరెస్టు