అన్నానగర్: ఇథియోపియా నుంచి విమానంలో చైన్నెకి అక్రమంగా తరలిస్తున్న రూ.64 కోట్ల విలువైన 8.26 కిలోల హెరాయిన్ను చైన్నె విమానాశ్రయంలో గురువారం కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వృద్ధుడిని అరెస్టు చేసి ప్రశ్ని స్తున్నారు. వివరాలు.. చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం గురువారం వచ్చింది. ఈ విమానంలో భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు చైన్నెలోని యునైటెడ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో విమానంలో వచ్చిన వారిని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీ చేసింది.79 ఏళ్ల వ్యక్తిని ప్రశ్నించగా అతడు తాత్కాలిక వీసాపై ఆఫ్రికా దేశాలకు వెళ్లి ఇథియోపియా మీదుగా చైన్నెకి వస్తున్నట్లు తేలింది. అతని సూట్కేస్లో దాచిన 2 పార్సిళ్లలో రూ. 64 కోట్ల విలువైన 8.26 కిలోల హెరాయిన్ను సీజ్ చేశారు. ఆ తర్వాత హెరాయిన్ను ముంబైకి తరలించారు. అనంతరం నిందితుడిని యూనియన్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. అలాగే అతడు అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠాకు చెందినవాడని తేలడంతో విచారణ ముమ్మరం చేసింది.