
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యకల్యాణంలో భాగంగా ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు చేశారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రసరమ్యంగా రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు.