
సాదాబైనామాకు మోక్షం!
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్పై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పోర్టల్లో సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్ల క్రితం సాదాబైనామా కింద భూముల మార్పిడి కోసం రైతులు వేలాది దరఖాస్తులు ఇచ్చారు. నాటినుంచి వీటికి అతీగతి లేకుండా పోయింది. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు చేతికి రావడం లేదు. ఈ నేపథ్యంలో భూభారతి పోర్టల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో 29,814 పెండింగ్ దరఖాస్తుదారులకు మోక్షం కలగనుంది.
సాదాబైనామాకు అవకాశం ఇవ్వడంతో..
2014 జూన్ 2 నాటికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల క్రమవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీనికి సంబంధించి 2020 నవంబర్ 10 వరకు జిల్లావ్యాప్తంగా దాదాపు 29,814 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉండగా.. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టారు. పాత చట్టం ప్రకారం సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించగా కొత్తచట్టం అమలులోకి రావడంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి.
పెండింగ్లో 29,814 దరఖాస్తులు
ఐదేళ్లుగా కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
పట్టాలు రాక నానా అవస్థలు
భూ భారతి పోర్టల్పై ఆశలు
ఆర్డీఓలకు బాధ్యతలు..
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ చట్టంలోనే ఈ సాదాబైనామా దరఖాస్తులపై 90 రోజుల్లోపు విచారణ చేపట్టాలని, ఈ బాధ్యతలను సైతం ఆర్డీఓలకు అప్పగించారు. విచారణ చేపట్టి దరఖాస్తుదారులకు హక్కులు కల్పించాలని చట్టంలో పేర్కొనడంతో వారికి ఊరట కలగనుంది.