యవ వికాసం.. మరింత ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

యవ వికాసం.. మరింత ఆలస్యం

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

యవ వికాసం.. మరింత ఆలస్యం

యవ వికాసం.. మరింత ఆలస్యం

నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది. అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో లబ్ధిదారులకు సాయం అందించాల్సి ఉండగా పలు ఆరోపణల నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడింది.

486గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని 23 మండలాల పరిధిలో 486 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. 4.24 లక్షల కుటుంబాల పరిధిలో 13 లక్షల పైచిలుకు జనాభా ఉంది. రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజికవర్గాలకు చెందిన 60,304 మంది దరఖాస్తు చేసుకున్నారు.

లబ్ధిదారుల్లో నిరాశ..

ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం యూనిట్ల పంపిణీని వాయిదా వేయడంతో ఆయా కేటగిరీలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తు దారులకు మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్‌ విలువ ప్రకారం అయిదు విడతల్లో అక్టోబర్‌ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి విడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2 లో రూ.1లక్ష వరకు ఎంపికై న లబ్ధిదారులకు జూన్‌ 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15 లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే నెలాఖరులోపు రాయితీ విడుదల చేసి గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియ వాయిదా పడటంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు..

ఈ విషయంపై సంబంధిత అధికారులను అడగగా ప్రభుత్వం నుంచి తదుపరి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు.

ఫ యూనిట్ల పంపిణీ వాయిదా

ఫ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో నిరాశ

ఫ సర్కారు ఉత్తర్వుల మేరకు ముందుకెళ్తామంటున్న అధికారులు

ఫ జిల్లా వ్యాప్తంగా 60,304 మంది దరఖాస్తుదారులు

పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే..

జిల్లాలో 1, 2 కేటగిరీల్లో 2,317 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించి రాష్ట్ర ఆవిర్భావం రోజున లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మరింత లోతుగా విచారణ చేసి నిజమైన లబ్ధి దారులకు మాత్రమే సాయం అందించాలన్న వినతులతో జూన్‌ 2న ప్రారంభం కావాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

సామాజిక వర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు

ఎస్సీ 16,376 ఎస్టీ 8947 బీసీ 29,112 ఈబీసీ 1838 ముస్లిం మైనార్టీ 3935

క్రిస్టియన్‌ మైనార్టీ 96 మొత్తం 60,304

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement