
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల నిర్వహణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తిరుమలగిరి మండలంలో పర్యటించి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి. రాంబాబు కోదాడ నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు.
విడతల వారీగా..
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 3 నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూభారతి చట్టం అమల్లోకి రాగా మొదటి దశలో రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా, రెండో దశలో మే 5 నుంచి జిల్లాలోని గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయగా త్వరలోనే లబ్ధిదారులకు భూపట్టాలను అందించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గరిడేపల్లి మండలంలో దాదాపు 1,670 భూ సంబంధిత దరఖాస్తులు వచ్చాయి.
20 వరకు సదస్సులు
జిల్లావ్యాప్తంగా 33 రెవెన్యూ గ్రామాల్లో తొలి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 1,975 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన రెవెన్యూ గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరగనున్న గ్రామాలు, తేదీల వివరాలతో సహా గ్రామస్థాయిలో అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు మండలానికి రెండు రెవెన్యూ సదస్సులు జరిగేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు
రెవెన్యూ సదస్సులు ప్రారంభం
ఫ జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు
ఫ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ