
నేటి నుంచి బడిబాట
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19వరకు బడిబాట నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆచార్య జయ శంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తారు.
ఇంటింటికీ తిరిగి..
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. శుక్రవారం నుంచి నిర్వహించే బడిబాటలో ఆయా గ్రామాలు, ఆవాసాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, పుస్తకాల పంపిణీ తదితర వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు.
గత ఏడాది 2,700 మంది విద్యార్థులు చేరిక..
గత ఏడాది నిర్వహించిన బడిబాటలో జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 2,700 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అలాగే ఈ ఏడాది వేసవి సెలవుల ప్రారంభం నుంచే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తు బడిబాటలో సుమారు 3,034 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు
పెంచడమే లక్ష్యం
ఫ 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఫ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయనున్న ఉపాధ్యాయులు
బడిబాటను విజయవంతం చేయాలి
ప్రతి రోజు ఉదయం 7గంటలకే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తాం. ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతుంది. – అశోక్, డీఈఓ

నేటి నుంచి బడిబాట