పబ్లిక్‌క్లబ్‌ భవన వేలం నిర్ణయం.. వివాదాస్పదం | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌క్లబ్‌ భవన వేలం నిర్ణయం.. వివాదాస్పదం

Jun 6 2025 12:58 AM | Updated on Jun 6 2025 12:58 AM

పబ్లిక్‌క్లబ్‌ భవన వేలం నిర్ణయం.. వివాదాస్పదం

పబ్లిక్‌క్లబ్‌ భవన వేలం నిర్ణయం.. వివాదాస్పదం

కోదాడ: కోదాడ పబ్లిక్‌క్లబ్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనానికి వేలం వేసి విక్రయించాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం క్లబ్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉండగా, నాలుగేళ్ల క్రితం పాతకార్యవర్గం జనరల్‌ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా వేలం వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వేలం ప్రక్రియను అత్యంత గోప్యంగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా భవనం కోదాడ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌లో లేదా బఫర్‌ జోన్‌లో ఉన్నా.. నాలా అనుమతులు లేకున్నా, పంచాయతీ అనుమతులు లేకున్నా క్లబ్‌ వారికి సంబంధం లేదని, పాటలో దక్కించుకున్న వారే ఇవన్నీ చూసుకోవాలని వేలం నిబంధనలు పెట్టారు. క్లబ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ సామాజికవర్గం తమ వారికి కారుచౌకగా ఈ భవనాన్ని కట్టబెట్టడానికి ఈ తతంగం నడుపుతోందని పలువురు క్లబ్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే..

కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో పబ్లిక్‌ క్లబ్‌ ఉంది. గతంలో ఇక్కడ జోరుగా పేకాట ఆడేవారు. క్లబ్‌కు రోజువారీగా రూ. లక్షల్లో ఆదాయం వచ్చేది. ఈ డబ్బుతో దాదాపు 15 ఏళ్ల క్రితం పట్టణ సమీపంలో రాఘవపురం వద్ద రూ.కోటితో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి నూతన భవన నిర్మాణం చేపట్టారు. క్లబ్‌కోసం కొనుగోలు చేసిన ఈ భూమి కోదాడ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌లో కొంత భాగం, బఫర్‌జోన్‌లో కొంతభాగం ఉంది. దీంతో దీనికి నాలా, భవన నిర్మాణ అనుమతులు రాలేదని సమాచారం. అయినప్పటికీ నాటి క్లబ్‌ పాలకవర్గం తమకున్న పలుకుబడితో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసి నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ లోగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేకాటక్లబ్‌లు మూత పడ్డాయి. ఆదాయం లేక పోవడంతో కొత్తభవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. అది పూర్తి కావడానికి మరో కోటిరూపాయలు అవసరం కాావడం, క్లబ్‌ వద్ద అంత డబ్బు లేక పోవడంతో 12 సంవత్సరాలుగా భవన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది.

ఫ ప్రస్తుతం క్లబ్‌ అధ్యక్షుడు,

ఉపాధ్యక్షుడు అమెరికాలో

ఉండగా వేలానికి నిర్ణయం

ఫ నాలుగేళ్ల క్రితం చేసిన తీర్మానం

ఆధారంగా వేలంపాట

ఫ రూ.3.25 కోట్లుగా ధర

ఫ వేలానికి నాలుగు రోజులే సమయం

ఫ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే తమకు

సంబంధం లేదని నిబంధన

నిబంధనల ప్రకారం వేలం వేయాలి

కోదాడ పబ్లిక్‌క్లబ్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని నిబంధనల ప్రకారం వేలం వేయాలి. నాలుగు సంవత్సరాల క్రితం చేసిన తీర్మానం ఆధారంగా వేలం వేయవద్దు, తాజాగా తీర్మానం చేసి ప్రధాన పత్రికల్లో ప్రకటన ఇచ్చిన తరువాత తగిన సమయం ఇచ్చి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందుబాటులో ఉన్న సమయంలో వేలం నిర్వహించాలి.

– సుంకర పుల్లయ్య, క్లబ్‌ శాశ్వత సభ్యుడు

హడావుడిగా వేలం నిర్ణయం

ప్రస్తుత కోదాడ పబ్లిక్‌క్లబ్‌ అధ్యక్షుడు గాయం పట్టాభిరెడ్డి, ఉపాధ్యక్షుడు వేనేపల్లి సత్యనారాయణలు ఇద్దరు కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో క్లబ్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని వేలం వేయాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వేలం వేస్తున్న విషయాన్ని రెండు రోజుల క్రితం కేవలం క్లబ్‌ నోటీస్‌ బోర్డులో పెట్టారు. అమ్మకం ధర రూ.3 కోట్ల 25 లక్షలుగా, ఽ వేలంలో పాల్గొనేవారు రూ.3 లక్షల 2 వేలు శనివారం వరకు చెల్లించాలని, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల మధ్య వేలం పాట నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. భవనం ఎఫ్‌టీఎల్‌లో ఉన్నా, నాలా, నిర్మాణ అనుమతులు లేకున్నా తమకు సంబంధం లేదని వేలం నిబంధనల్లో పేర్కొనడం గమనార్హం. ఇలాంటి నిబంధనలు పెట్టి వేలంలో ఎక్కువ మంది పాల్గొనకుండా చేసి తక్కువ రేటుకు తమ అనుయాయులకు కట్టబెట్టాలని చూస్తున్నారని కొంత మంది క్లబ్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement