
రైతు భరోసా వస్తుందా..
నాగారం : వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. భూములు దుక్కులు దున్ని, విత్తనాలు కొనుగోలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి వర్షాలు ముందస్తుగానే కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ తరుణంలో అన్నదాతలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వం గత యాసంగి సాయం రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అప్పుడు సాయం పొందని వారు... ఈ సారి రెండు సీజన్లవి కలిపి ఇస్తారా? ప్రస్తుతం వానాకాలంది ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
6.17లక్షల ఎకరాల్లో సాగు అంచనా
జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది, పెసర, జొన్న, మొక్కజొన్న.. ఇలా తదితర పంటలు 6.17 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమైన ఎరువులు తెప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. గత యాసంగికి సంబంధించి జనవరి 26నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఎకరా, రెండు.. ఇలా విడతల వారీగా 5 ఎకరాల లోపు వరకు పెట్టుబడి సాయం అందించారు. ఆ తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వానాకాలంవచ్చింది. ఈసారైనా పూర్తి స్థాయిలో సాయం అందుతుందా? లేదా? అన్నదాతలు మదనపడుతున్నారు.
సాయం అందని వారు 37వేల మందికి పైనే..
జిల్లాలో 2,81,579 మంది రైతులు రైతు భరోసా పొందుతుండగా.. వీరిలో గత యాసంగి సీజన్లో 2,44,423 మంది రైతులకు పెట్టబడి సాయం అందింది. ఇంకా 37,156 మంది రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు విడతల వారీగా ప్రభుత్వం సాయం మంజూరు చేసింది. తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచి పోయింది.
వానాకాలం పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు
ఫ దుక్కులు దున్ని సాగుకు
సిద్ధమవుతున్న రైతులు
ఫ 6.17లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఫ యాసంగిలో 37,156 మందికి
అందని సాయం
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాం
నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఏటా వరి, పత్తి సాగు చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడి సాయం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అందలేదు. ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇప్పటికే భూమి దున్ని సిద్ధం చేశా. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా. ప్రభుత్వం త్వరగా సాయం అందిస్తే మాలాంటి రైతులకు మేలు కలుగుతుంది.
–బోయిని నాగయ్య, రైతు, తుంగతుర్తి.
యాసంగి సీజన్ రైతు భరోసా వివరాలు..
మొత్తం రైతులు: 2,81,579
రైతు భరోసా పొందిన వారు: 2,44,423
మంజూరైన సాయం: రూ.227.44 కోట్లు
సాయం అందని రైతులు: 37,156
అందాల్సిన డబ్బులు: రూ.108.06కోట్లు

రైతు భరోసా వస్తుందా..