
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు నాటడం, సంరక్షించడం దినచర్యలో భాగం కావాలని సూచించారు. అటవీ శాఖ కార్యాలయాన్ని చూస్తే చాలా ముచ్చటగా ఆహ్లాదకరంగా ఉందని, కలెక్టరేట్ చుట్టూ కూడా ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారి నాగయ్యకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీబీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ఙ్ అనే నినాదాన్ని తీసుకున్నారని, అందరం కలసి ప్లాస్టిక్ పొల్యూషన్ లేకుండా చేయాలని, రూరల్ ,అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పరిశ్రమల వల్ల గ్రీనరీ తగ్గిపోతుందని, అందరూ తమ వంతు కృషిగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీఓ వీవీ అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డీసీఓ పద్మ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీఓ వేణుమాధవ్, ఎఫ్ఆర్ఓ ఎస్. ఆనంద రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, మంజుల, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు.