
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 23 మండలాల్లో గల 32 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని పేర్కొన్నారు. జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, భూ సమస్యలు ఉన్న రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ముందుగా సదస్సులో దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలు అందించాలన్నారు. సదస్సులో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేయాలన్నారు. భూ భారతి చట్టంలో అధికారుల వికేంద్రీకరణ చేశామని ఎక్కువ శాతం దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన రైతు మాలోతు భిక్షం తన భూ సమస్య చాలా రోజుల నుంచి పరిష్కారం కావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. భిక్షం సమస్యను కలెక్టర్ ఓపిక గా విన్నారు. ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్, డీఆర్డీఓ వివి అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్, డీపీఓ యాదయ్య, తహసీల్దార్ హరిప్రసాద్ , ఆర్ఐ జార్జి రెడ్డి , జూనియర్ అసిస్టెంట్ అనిత, అజయ్, వినోద్ , శ్రీశైలం సిబ్బంది పాల్గొన్నారు.