
పారిశుద్ధ్య నివేదికకు సనేమిరా..
ఫ డెయిలీశానిటేషన్
రిపోర్ట్ యాప్పై నిరసన
ఫ పదిరోజులుగా నమోదు చేయని
పంచాయతీ కార్యదర్శులు
ఫ ఇప్పటికే పాలకవర్గాలు లేక
ఉన్న పనులతో
సతమతమవుతున్నామని ఆవేదన
నాగారం : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ నివేదికను ఎప్పటికప్పుడు డీఎస్ఆర్(డెయిలీ శానిటేషన్ రిపోర్డ్) యాప్లో నివేదించాలన్న ప్రభుత్వ నూతన మార్గదర్శకాలను పంచాయతీ కార్యదర్శులు పక్కన పెట్టారు. ఆన్లైన్ ద్వారా నివేదికలను అందజేయాలంటే తమకు భారంగా మారుతోందని చెబుతున్నారు. పది రోజులుగా ఆన్లైన్ నివేదికను యాప్లో నమోదు చేయడం లేదు. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 460 మంది కార్యదర్శులు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాలకవర్గాలు లేక, నిధులు విడుదలకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులుచేసి పంచాయతీల్లో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. డీఎస్ఆర్ యాప్లో పారిశుద్ధ్య నివేదికను రోజువారీగా నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి గత నెల 24న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిత్యం ప్రజల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఈ నివేదిక తలనొప్పిగా మారిందని హాజరు నమోదును పది రోజులుగా నిరాకరించారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లో పనిచేస్తే యాప్ల పేరుతో తమకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్ఆర్ యాప్ ఇలా..
పంచాయతీ పరిధిలో రోజూ ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారో యాప్లో నమోదు చేయాలి. తడి, పొడి చెత్త ఎంత పరిమాణంలో(కిలోల చొప్పున) సేకరించారో పొందుపర్చాలి. మొత్తం ఇళ్ల నుంచి రోజులో ఎంత పరిమాణంలో సేకరించారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక వంటి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చెత్త సేకరణలో తిరగమన డంతో రోజువారీ పనులు పడకేస్తాయని కార్యదర్శులు వాపోతున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యతో సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సర్వే, ఆహారభద్రత కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల కారణంగా సుమారు 10 యాప్లలో వివరాలు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరో యాప్తో ఇంకా కష్టాలు పెరుగుతాయని అంటున్నారు.
మా కష్టాలు ఎవరూ గుర్తించడం లేదు
పద్దెనమిది నెలలుగా పాలకవర్గం లేక, నిధులు లేక, పంచాయతీల అభివృద్ధికి అప్పు చేసి నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వ పథకాల పనుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లో ఉంటున్నాం. మా కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. తాజాగా యాప్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎంత పని చేసినా కార్యదర్శుల పనికి తగిన గుర్తింపు లభించడం లేదు. పారిశుద్ధ్య నివేదికను సైతం పదిరోజులుగా నమోదు చేయడం లేదు. మా సమస్యను ప్రభుత్వానికి నివేదించినా ఎలాంటి స్పందన లేదు.
–ఎం.డీ.ఫరీద్, పంచాయతీ కార్యదర్శుల
సంఘం జిల్లా అధ్యక్షుడు.

పారిశుద్ధ్య నివేదికకు సనేమిరా..