
చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకే
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. బుధవారం రాత్రి సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజాభరోసా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత కష్టపడి చదువి ఉన్నతస్థానానికి చేరాలని సూచించారు. గ్రామాల్లో అలజడులు సృష్టించి అశాంతికి కారణమయ్యేవారిని, అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని అన్నారు. ఎన్నికలు ఎలాంటివైనా గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో గొడవలు పడవద్దని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారని, మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సర్కిల్ ఎస్ఐలు శ్రీకాంత్, మహేశ్వర్, గోపీకృష్ణ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ