
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఆర్ఐలు మంత్రిప్రగడ సీతరామచందర్రావు, శ్వేత, కార్యదర్శి కార్తిక్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
నూతనకల్: వర్షపు నీరు వృథాకాకుండా నిల్వ చేయడానికి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఆర్డీఓ అప్పారావు సూచించారు. మంగళవారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మురుగు కాల్వల చివర ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాల పెరిగేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, ఎంపీడీఓ సునిత, ఎంపీఓ శశికళ, ఏపీఓ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం
తిరుమలగిరి (తుంగతుర్తి) : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాములలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని డీఈఓ అశోక్ తెలిపారు.మంగళవారం డీఈ రంగారావుతో కలిసి తాటిపాములలో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గత నెలలో గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని స్థానికులు కలిశారు. పాఠశాలలో గదుల కొరత ఉందని తెలియజేయడంతో రూ.3 కోట్లతో నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా అధికారులు పాఠశాలలో స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీధర్, హెడ్మాస్టర్లు ఎం.శ్రీనివాసులు, కె.సత్తయ్య పాల్గొన్నారు.
రెండో ఇంక్రిమెంట్ ఇవ్వాలి
సూర్యాపేటటౌన్ : సర్వీస్ రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులకు రెండో ఇంక్రిమెంట్ ఇవ్వాలని టీజీజేఎల్ఏ 475 అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సీహెచ్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు గుణగంటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 3,500 మంది అధ్యాపకుల సర్వీసులను 2023 మే 4న అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం వీరికి ఏటా ఇంక్రిమెంట్ ఉంటుందని, అయితే గత సంవత్సరం ఇచ్చారని, ఈ సంవత్సరం మాత్రం తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ జానియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆపారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్లో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చర్ అసోసియేషన్ 475 ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రెండో ఇంక్రిమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం

దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం