
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట మండలం కేసారంలో గల రైతు వేదికలో ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం’ అనే అంశంపై మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపాసాగర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్యతో కలిసి ఆయన రైతులకు అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా 10 నుంచి 15 శాతం దిగుబడి పెంచుకోవచ్చన్నారు. రైతులు వ్యవసాయ పరిశోధన సంస్థల ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని, సాగు చేసేప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే అదే విత్తనాలను రెండు మూడు సంవత్సరాల పాటు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు.అనంతరం రైతులకు నాణ్యమైన విత్తనాల బ్యాగ్లను అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.కృష్ణ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్తయ్య, సుష్మ, లక్ష్మీ అనూష, స్వాతి, రైతులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి