
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
సూర్యాపేట అర్బన్: ఆపరేషన్ కరాగ్ను నిలిపివేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపుమేరకు వామపక్ష పార్టీలతో కలిసి నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపి మాట్లాడారు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అడవులన్నీ బాంబుల మోతలతో తల్లడిల్లుతున్నాయని, కర్రెగుట్ట పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుంచి ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా వందలాదిమంది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్రె గుట్ట ప్రాంతం నుంచి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా స్పందించి ములుగు, చర్ల ప్రాంతాల్లో ఉన్న బలగాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ జిల్లా నాయకుడు దంతాల రాంబాబు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎల్. భద్రయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. లింగయ్య, ప్రజా ఫ్రంట్ నాయకులు కోటయ్య, కరీం, సీపీఐ జిల్లా నాయకులు బూర వెంకటేశ్వరు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దండ వెంకటరెడ్డి పాల్గొన్నారు.