
6.17 లక్షల ఎకరాలు
వానాకాలం సాగు అంచనా
భానుపురి (సూర్యాపేట): వ్యవసాయ శాఖ రానున్న వానాకాలం –2025 సాగు ప్రణాళి ఖరారు చేసింది. జిల్లాలో 6,17,480 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే జిల్లాలో 22,143 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా వచ్చే సీజన్కు సంబంధించి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కోసం ముందస్తుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
మెట్టపంటలపై ఆశలు లేకుండానే..
జిల్లాలో రానున్న వానాకాలం సీజన్లో 6,17,480 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్టు అంచనా వేసిన వ్యవసాయ శాఖ అత్యధికంగా వరి 4,85,215 ఎకరాలు, పత్తి 91,000 ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. గతేడాది వానాకాలం 6,34,400 ఎకరాల్లో పంటలు వేస్తారని భావించినా 6,13,888 ఎకరాల్లోనే సాగు చేశారు. ఆరుతడి పంటలైనా కంది 7,500 ఎకరాలు, పెసర 4వేలు, వేరుశనగ 1,250 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసినా సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కంది 2,650 ఎకరాలు, పెసర 2,700, వేరుశనగ 400 ఎకరాలకే పరిమితం చేశారు.
విత్తనాలకు కొరత రాకుండా..
జిల్లాలో సాగు కానున్న 4,85,215 ఎకరాలకు గాను 87,322 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం పడనున్నాయి. అలాగే కంది 2,650 ఎకరాలకు 159 క్వింటాళ్లు, పెసర 2700 ఎకరాలకు 108 క్వింటాళ్లు, జొన్నలు 45 ఎకరాలకు 5 క్వింటాళ్లు, వేరుశనగ 400 ఎకరాలకు 360 క్వింటాళ్ల చొప్పున విత్తనాలు కావాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత రెండోస్థానంలో ఉండే పత్తి విత్తనాలు 2,27,500 ప్యాకెట్లు (475 గ్రాములు) రైతులు వినియోగించనున్నారు. ఇక 8,580 ఎకరాల్లో పచ్చిరొట్టె విత్తనాలను విత్తనుండగా.. ఇందుకోసం 3,800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదించారు.
విత్తనాలు, ఎరువుల కోసం
ప్రతిపాదనలు
ప్రభుత్వానికి నివేదిక పంపిన
వ్యవసాయ శాఖ
ఈ సారి మెట్టపంటల సాగు
తగ్గే అవకాశం