● రద్దయిన నీట్ పరీక్ష
● పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలమైన కేంద్రం
● జిల్లాలో పరీక్ష రాసిన వారి సంఖ్య 1904
● తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ: నీట్ యూజీ–2026 పరీక్ష రద్దయ్యింది. పేపర్ లీకేజీ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈనెల 3వ తేదీన మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)చదువుల కోసం దేశవ్యాప్తంగా ఏకకాలంలో నీట్ యూజీ–2026 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా నుంచి మొత్తం 1951 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1904 మంది పరీక్ష రాశారు.
మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రెండేళ్ల కిందట కూడా నీట్ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. పరీక్షలపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోసారి నీట్కు సన్నద్ధం కావాలంటే తమ మానసిక పరి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆశ్చర్యపోయాను
బాధ్యులను శిక్షించాల్సింది పోయి నీట్ రాసిన వారందరినీ ఇలా శిక్షించడం సరికాదు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేయడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాయాలంటే ఎంత కష్టం. ఆ వాతావరణం మళ్లీ వస్తుందా.. ఇలా రద్దు చేసి ఎంత మందో అభ్యర్థుల జీవితాలను ఫణంగా పెట్టారు. లీక్ బాధ్యులను ఉరి తీయాలి. అప్పుడే మళ్లీ లీక్ చేయడానికి భయపడతారు. అలాగే గతంలో వలే ఈ పరీక్షలు రాష్ట్రాలకు అప్పగించాలి. మా అబ్బాయి పరీక్ష రాశాడు. ఎంతో వ్యయప్రయాసలకు కుటుంబమంతా గురయ్యాం. ఇప్పుడు కథ అంతా మళ్లీ మొదటికే వచ్చింది.
–ఎన్.అప్పయ్య, విద్యార్థి తండ్రి, నరసన్నపేట,


