అక్రమ లేఔట్కు ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు కూటమికి అధికారమిచ్చింది దోచుకోవడానికా? విలేకరుల సమావేశంలో ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ధ్వజం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సదావర్తి భూముల్లో అక్రమ లేఔట్ నిర్మించి ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. ఈ స్థలంలో ఒక్క ఇల్లూ లేనప్పటికి రోడ్లు వేయటం కూన అవినీతికి అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ బావాజీ మఠం భూములు 1600 సంవత్సరాలకు ముందువని చెప్పారు. మఠం భూముల్లో అక్రమ లేఔట్లు నిర్మించి ప్రజలకు అమ్మకం చేసి సొమ్ము చేసుకోవాలన్నా సరికాదన్నారు. పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. సదావర్తి భూములు కాజేసేందుకేనా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నదని మండిపడ్డారు. 1947 ఎండోమెంట్ చట్టం ప్రకారం నోటీసులు కూడా ఇచ్చారని, చారిటీ భూములు, సదావర్తి భూములు నాన్ ట్రాన్స్ఫర్ భూములు కింద నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ భూములను 22–ఏ నిషేధిత భూముల్లో కూడా పెట్టారన్నారు. రిజిస్ట్రేషన్ భూములుగా అమ్మకం ప్రారంభించిన కూన రవికుమార్ కుటుంబ సభ్యులు సామాన్యుల్ని మోసగించి అమ్మేస్తున్నారని ఆరోపించారు. అక్రమ లేఔట్కి కలెక్టర్ రోడ్లు మంజూరుచేయడం దారుణమన్నారు. కూన రవికుమార్ సోదరుడు, కాంట్రాక్టర్ నాణ్యత లోపాలతో రోడ్లు, కాలువలు వంటివి చేపట్టి ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కూన రవికుమార్ అక్రమాలు, అవినీతిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, రాష్ట్ర బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, బూత్కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, ఆమదాలవలస నగర అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పొన్నపురెడ్డి తవిటినాయుడు, సాకేటి శ్రీనివాసరావు, గదిలి రమణ తదితరులు పాల్గొన్నారు.


