రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం జాతీయ రహదారిపై సూర్య స్కూల్ కూడలిలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండములగాం గ్రామానికి చెందిన గుంటముక్కల నర్సింహమూర్తి (52) విశాఖపట్నం వెళ్లేందుకు ద్విచక్ర వాహనంతో మంగళవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. 4.45 గంటల సమయంలో సూర్య స్కూల్ కూడలి వద్ద అవతల వైపునకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింహమూర్తి తుళ్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు శవపంచనామా నిమిత్తం తరలించారు. నర్సింహమూర్తికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


