● ఎమ్మెల్సీ నర్తు రామారావు
ఇచ్ఛాపురం రూరల్: అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారని, ప్రజల కలల రాజధాని కాకుండా అధికార పార్టీ ల్యాండ్ డిపాజిట్ బ్యాంకుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ ముందు నుంచి చెబుతున్న మాటలే వాస్తవాలు అయ్యాయని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు కేటాయించిన ప్లాట్లు, చంద్రబాబునాయుడు అనుచరులకు ఇచ్చిన ప్లాట్ల వివరాలను పరిశీలించిన అమరావతి ప్రాంత రైతులు నివ్వెరపోతున్నారని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు ముంపు ప్రాంతాలలోనూ ప్లాట్లు కేటాయిస్తే, చంద్రబాబునాయుడుకు భజన చేసే వారికి విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడాన్ని ఇప్పుడిప్పుడే రాజధాని రైతులు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించిన పచ్చ పత్రికలు ప్రస్తుతం ఎందుకు ఆ వివరాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, పేద ప్రజలకు ఏమైనా మేలు చేశారా..?అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు నిలిపివేశారని, రాష్ట్రంలో ఒక్క వితంతువుకూ కొత్తగా పెన్షన్ మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు.


