బూర్జ : మండల కేంద్రం బూర్జ గ్రామానికి చెందిన బంక రెయ్యిబాబు(38) సోమవారం ఉదయం విశాఖపట్నం షీలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెయ్యిబాబు ఎయిర్ఫోర్స్లో పనిచేస్తూ ఆరు నెలల కిందట ఉద్యోగ విరమణ పొందాడు. షీలానగర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 10న స్వగ్రామం బూర్జలో శుభకార్యం నిమిత్తం వచ్చి తిరిగి సోమవారం విశాఖపట్నం బయలుదేరాడు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షీలానగర్కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెయ్యిబాబుకు భార్య నళిని, కుమారులు దినకర్, కౌశిక్ ఉన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
సంతబొమ్మాళి: దండుగోపాలపురం రైల్వే హాల్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి సోమవారం మృతి చెందాడు. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు నుంచి జారిపడినట్లు తెలుస్తోంది. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


