అరసవల్లి: వైశాఖమాసం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సందడి కనిపించింది. చివరి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయక పూజలు నిర్వహించారు. పెసల మొలకలు, ధాన్యం, బెల్లం, వడపప్పు, మామిడి పండ్లు, టెంకాయలతో ప్రత్యేకంగా స్వామి వారికి నివేదించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ మొక్కుకున్నారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకున్నారు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కబోత, ఎండతీవ్రత పెరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్కరిణి సమీపంలో టెంట్లు ఉన్నప్పటికీ ఏమాత్రం సరిపడకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నదాన ప్రసాదానికి భక్తులు బారులు తీరారు. పెందుర్తికి చెందిన భక్తులు ఆరిపాక సంధ్యారాణి, ఆమె కుమారుడు అయాన్ష్ నందన్లు తులాభారం మొక్కు చెల్లించుకుని 60 కేజీల బెల్లం చెక్కీలను ఈవో ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణల సమక్షంలో ప్రసాదాల విభాగానికి సమర్పించారు.


