విద్యార్థులారా తొందరపడండి
వేసవిలో సర్టిఫికెట్లు చేయించుకుంటే మేలు
వెంటనే దరఖాస్తు చేసుకుంటే..
హిరమండలం:
పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పది, ఇంటర్ విద్యార్థులకు ఉన్నత చదువులకు పలు ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటిని ముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒత్తిడి పెరగక ముందే..
ఏటా మే, జూన్ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో ఒత్తిడి అఽధికంగా ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరు గుతుంది. దీంతో మాటిమాటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ముందుగా మేల్కొంటే ఈ అవస్థ తప్పుతుంది.
పత్రాలు పొందాలంటే..
తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కుల, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. వీటికోసం మీసేవా, స్వర్ణగ్రామం సచివాలయాలు వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత అర్జీ పూర్తి చేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్ సహాయకుడికి అందజేయాలి. ఆన్లైన్లో పొందపరిచిన ఈ వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలోను, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)నేరుగాను పరిశీలిస్తా రు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్ తన లాగిన్లో మరోసారి నిశితంగా అన్నింటినీ తనిఖీ చేసి డిజిటల్ సంతకం చేస్తారు. దీనిపై చరవాణికి వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయం లేదా మీసేవాలో ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు.
కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళ న చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు నిర్దేశించిన సమయం కంటే ముందు జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– కె.బాలకృష్ణ, తహసీల్దార్, హిరమండలం


