శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్లోగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎస్బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు.
ఆకస్మిక తనిఖీ
బూర్జ: పాలవలస సచివాలయం పరిధిలోని లక్కుపురం గ్రామంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ కమిషనర్ బి.హర్ష స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పర్యటనలో భాగంగా లక్కుపురంలో ఎంపీడీఓ ఆర్.తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ రఽథం కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
హిరమండలం: పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువులో పడి ఒడిశాకు చెందిన పురోనభత్ర (24) అనే యువకుడు మృతిచెందాడు. వంశధార రిజర్వాయర్ వద్ద నీరు వచ్చే గెడ్డలో పడి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి సోదరుడు త్రిలోచనభత్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన పురోనభత్ర, త్రిలోచనమిత్ర అన్నదమ్ములు. ఇందులో పురోనభత్ర పెద్దసంకిలి గ్రామానికి చెందిన పల్ల శ్రీనివాసరావు వద్ద బోర్లు తవ్వే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం మెట్టూరు వద్ద నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిలేకపోవడంతో తనతో పాటు పనిచేస్తు న్న సురుభత్ర, మహేష్భత్ర, అమిత్ బడాతో కలిసి పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువు వద్ద చేపల వేటకు వెళ్లారు. అయితే అప్పటికే పురోనభత్ర మద్యం మత్తులో ఉండడంతో మిగతా ముగ్గురు వదిలేసి చేపల వేటలో నిమగ్నమయ్యారు. అయితే చేపల వేట ముగిసే సమయానికి పురోనభత్ర కనిపించలేదు. మెట్టూరులో రూములోకి వెళ్లిపోయాడని భావించి మిగతా ముగ్గురు వెళ్లిపోయారు. కానీ పురోనభత్ర ఇంటికి చేరలేదు. శుక్రవారం ఉదయం సైతం చేరకపోయేసరికి సోదరుడికి సమాచా రం అందించారు. పురోనభత్ర తన వద్దకు చేరలేదని చెప్పిన సోదరుడు త్రిలోచనభత్ర మెట్టూరుకు చేరుకున్నాడు. అనుమానంతో చెరువు వద్ద వెతకగా పురోనభత్ర మృతదేహం కనిపించింది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ఉండాడని సోదరుడు త్రిలోచనభత్ర పోలీసులకు ఫిర్యాదుచేశాడు.


