● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ
సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టారని, రబీలో సైతం అదే పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. రబీ సీజన్లో మొక్కజొన్న పంటలతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేయలేదన్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని అచ్చెన్నాయుడు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించడంతో రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ముందస్తు ప్రణాళిక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సాగునీటి కాలువల మరమ్మతుల విషయంలో సమీక్షలు నిర్వహించకుండా, కేవలం వర్షాలు పడే సమయానికి తూతూమంత్రంగా పనులు చేసి కోట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఖరీఫ్లో రైతులు పడిన ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు ఎందుకు రూపకల్పన చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అసమర్ధత ప్రభుత్వానికి రైతులు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


