కిలో
● భగ్గుమంటున్న కూరగాయల ధరలు
● బెంబేలెత్తుతున్న సామాన్యులు
● ఉల్లిపాయలు మినహా అన్నీ
రూ.60 పైమాటే!
ధరలు చూస్తే దడ..
మార్కెట్లో ధరలు చూస్తే సామాన్యులకు దడపుడుతోంది. కూరగాయలు, నూనె ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలు ఇలా ఉంటే పేద, మధ్య తరగతి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలి. – గులువిందల లలిత, తంప గ్రామం
జేబుకు చిల్లు..
ఇప్పటికే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా మారింది. డీజిల్ కొరత పేరిట సరుకుల రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ధరలు అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– నక్క ఆనందరావు, పాత హిరమండలం
హిరమండలం : మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వారం పదిరోజులుగా ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయలు, బంగాళదుంపలు తప్ప మిగతా కూరగాయలు కిలో రూ.50 నుంచి రూ.70 పైమాటే. బీన్స్, మిర్చి, ముల్లంగి, క్యారెట్, చిక్కుడుకాయల ధరలు పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలకు షాక్కు గురి చేస్తున్నాయి. ధరలు అదుపుచేసి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రమైన ఎండలు కారణంగా స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో పాటు డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. నిన్నమొన్నటి దాకా ధరలు లేక కుదేలైన టమాట ఒక్కసారిగా కిలో రూ.50కు పెరిగింది. మరోవైపు బీన్స్ కిలో రూ.150 ధర పలుకుతోంది. కాగా కొత్తిమీర కట్ట రూ.20 ధర పలుకుతుండటంతో నాన్వెజ్ వంటకాల్లో రుచి తగ్గుతోంది. మిగతా ఆకుకూరలు కూడా కట్టకు రూ.5 చొప్పున పెంచేశారు.
మార్కెట్లో ధరలు ఇలా..
కూరగాయలు ధరలు
బీన్స్ రూ.150
చిక్కుడు రూ.70
బీరకాయ రూ.80
క్యారెట్ రూ.60
ముల్లంగి రూ.60
పచ్చిమిర్చి రూ.60
కాకరకాయ రూ.60
టమాట రూ.50
వంకాయలు రూ.60
క్యాప్సికమ్ రూ.60
దోసకాయ రూ.40
గోబి రూ.40
క్యాబేజీ రూ.50
నిమ్మకాయలు రూ170


