శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లుగా పనులు చేస్తున్న వారికి గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్కా శ్రీకాకుళం అసోసియేషన్ అధ్యక్షుడు గొర్లె రామానాయుడు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్, కమిషనర్లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్–2025 మార్చి తర్వాత రిటర్న్ అయిన బిల్స్ నేటికి తిరిగి అప్లోడ్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రికార్డింగ్ పూర్తయి పాస్ ఆర్డర్లు వెయ్యకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు ఏళ్ల తరబడి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. పనులు పూర్తయినా ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు రికార్డింగ్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్, కమిషనర్ని కలిసిన వారిలో సబ్కా సంఘ నాయకులు గొర్లె వెంకటరామానాయుడు, చల్ల సింహాచలం, బాడాన హరికృష్ణ, గురుగుబెల్లి సుదర్శనరావు, గ్రంధి గణేష్, తంగి భాస్కర్, గంగు రాజు, రుద్రమహంతి కామేశ్వరరావు, మహేష్, కిల్లి మోహనరావు, వండాన మోహన్, దీర్ఘాసి తిరుమలరావు, రాయల సూర్యదీప్, సంతోష్, బాలకృష్ణ తదితరులున్నారు.


